మనిషిని చంపే హక్కు పోలీసులకెక్కడిది..?


నిజామాబాద్‌: రాష్ట్రంలో పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్లు జరుపుతూ.. కాల్చి చంపుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో హై కోర్టు వెలువర్చిన సంచలన తీర్పు పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. `ప్రతీ ఎన్‌కౌంటర్‌ సంఘటనకు సంబంధించి తప్పనిసరిగా పోలీసులపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలివ్వడం సరైన చర్యగా వివిధ పార్టీల నేతలు, విద్యావంతులు పేర్కొన్నారు. ఈ తీర్పు వల్ల బూటకపు ఎన్‌కౌంటర్లు తగ్గుముఖం పడ్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తోటి మనిషిని తీవ్రవాదం, తదితర నేరాల ముసుగులో కాల్చి చంపడం అమానుషమని, పోలీసులకు ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారంటూ ధ్వజమెత్తారు. మరోవైపు తాజాగా వెలువర్చిన హైకోర్టు తీర్పు బాధితుల కుంటంబసభ్యులు తమ వాదనను వినిపించే వెలుసుబాటు దొరికిందని, అయినప్పటీకీ పోలీసులు ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకోవడానికి మరిన్ని అవకాలున్నాయంటూ పౌర హక్కుల సంఘం భావిస్తోంది. శుక్రవారం హైకోర్టు వెలువర్చిన తీర్పు పై పలువురి అభిప్రాయాలను సేకరించినప్పుడు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి.

తీర్పు పాతదే… : కె.రాజారత్నం నాయుడు, నిజామాబాద్‌ రేంజ్‌ డిఐజి
గతంలో మాదిరిగానే ఈ తీర్పు ఉంది. ఎన్‌కౌంటర్‌ జరిగిన తర్వాత రిపోర్టును ఇప్పటికీ మెజిస్ట్రేట్‌కు పంపుతాం. ఇపుడు కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తున్నాం.. కోర్టుకు పంపిస్తున్నాం. అడవిలో సాయుధులైన తీవ్రవాదులు ఎదురుపడితే తప్పనిసరై ఆత్మరక్షణ కొరకు ఎదురుకాల్పులకు దిగాల్సి వస్తుంది. అంతేగానీ అనవసరంగా ఎవరి ప్రాణాలను తీయాలని పోలీసులకుండదు.

బాధితులకు కాస్త వెసులుబాటు… : మాధవరావు, ఎపీపీసీఎల్సీ జిల్లా నేత
ఎన్‌కౌంటర్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు హైకోర్టు తీర్పు కాస్త వెసులుబాటును కల్పించింది. అయితే గతంలోనూ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేవారు. పోలీసుల మీద హత్యాప్రయత్నం జరిగిందంటూ 307 కింద కేసు నమోదు చేసేవారు. ఫైనల్‌ రిపోర్టును మెజి్స్ట్రేట్‌కు పంపిస్తారు. ఇందులో 95 శాతం కేసులు పెండింగ్‌లోనే ఉంటాయి. అయితే తాజా తీర్పు వల్ల పోలీసులు చెప్పిన కారణాన్ని రుజువు చేయాల్సి వస్తోంది. కోర్టులో వారికి ప్రతికూలంగా గానీ..అనుకూలంగానీ తీర్పు రావచ్చు. దీంతో భయస్తులైన పోలీసులు ఎన్‌కౌంటర్ల జోలికి వెళ్లరు. కానీ, ఇపుడు కూడా పోలీసులు తప్పించుకునేందుకు అనేక మార్గాలున్నాయి. ఇది కేవలం విధినిర్వహణలో భాగంగానే చేశాం అంటూ తప్పించుకునే అవకాశాలూ ఉన్నాయి.

ఇక పోలీసులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిందే… పోశెట్టి, తెరాస జిల్లా అధ్యక్షులు
బూటకపు ఎన్‌కౌంటర్ల పేరుతో పోలీసులు అమాయకులను అనవసరంగా చంపకుండా హై కోర్టు సరైన నిర్ణయం తీసుకుంది. పోలీసులు చంపాలనుకున్న వారిని తీవ్రవాదులను చేసి పట్టుకెళ్లి చంపుతున్నట్లు పత్రికల్లో చూస్తున్నాం. అలాంటి ఘటనలు ఇక జరగకుండా ఉంటాయి. పోలీసులపై చర్యలు తీసుకునేందుకు ఈతీర్పు దారి సుగమం చేసింది. 

Posted in |

0 comments: